Thursday, October 3, 2024
HomeUncategorizedEMI రూపంలో లంచం స్వీకరిస్తున్న అధికారులు

EMI రూపంలో లంచం స్వీకరిస్తున్న అధికారులు

Date:

లంచాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు బాధితులకు లంచం భారంగా మారుతుందని దయ చూపించి ఈఎంఐల రూపంలో లంచం స్వీకరిస్తున్నారట. ఈ విషయాన్ని సాక్షాత్తూ గుజరాత్‌ యాంటీ కరెప్షన్‌ బ్యూరో డీజీపీ షంషేర్‌ సింగ్‌ ఓ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. చాలా మంది బాధితులు తొలి ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించిన తర్వాత తమ వద్దకు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన పలు కేసులను ఆయన వెల్లడించారు.

ఇటీవల ఒక సీఐడీ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ దొంగ సొత్తు స్వాధీనం కేసులో బాధితుడి వద్ద నుంచి రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీనిని ఇన్‌స్టాల్‌ మెంట్లుగా విభజించి నెలకు రూ.10 వేలు చెల్లించాలని సూచించారు. ఈ నెల మొదట్లో గుజరాత్‌ నీటి సరఫరా విభాగం బోర్డులో ద్వితీయ శ్రేణి అధికారి ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.2 లక్షల లంచం డిమాండ్‌ చేశాడు. దానిని నెలకు రూ.30 వేలు చొప్పున మూడు ఇన్‌స్టాల్‌మెంట్లుగా చెల్లించాల్సిందిగా సూచించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎస్‌జీఎస్‌టీ బోగస్‌ బిల్లింగ్‌ స్కామ్‌లో అధికారులు నిందితుడి నుంచి రూ.21 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశారు. దీనిని నెలకు రూ.2 లక్షల చొప్పున 10 వాయిదాలు.. రూ.లక్ష ఒక వాయిదాలో ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన సూరత్‌లోని ఒక ఉప సర్పంచ్‌, తాలుకా మెంబర్‌ గ్రామంలోని రైతుల నుంచి రూ.85 వేలు డిమాండ్‌ చేశారు. గామీణుల ఆర్థిక పరిస్థితి చూసి.. ఆ మొత్తాన్ని మూడు ఈఎంఐలుగా చెల్లించాలని కోరారు. మరో కేసులో నాలుగు సైబర్‌ పోలీసులు రూ.10 లక్షల లంచాన్ని నాలుగు ఈఎంఐల్లో అడిగినట్లు ఏసీబీ డీజీపీ వెల్లడించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఇటువంటి విధానాల్లో లంచాల స్వీకరించడం పెరిగిపోయిందని డీజీపీ తెలిపారు. ఈ బాధితుల్లో వివిధ కేసుల్లో నిందితులు ఉండటంతో వారు ఇతర అధికారులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారని చెప్పారు.