దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విడతల వారీగా కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే నాలుగు దశల్లో ఓటింగ్ పూర్తైంది. ఐదో దశ పోలింగ్ మే 20న సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి పలువురు ప్రముఖులు ఇంటి నుంచే ఓటేశారు. మాజీ ఉపరాష్ట్రపతి మహ్మద్ హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. ఢిల్లీ లోక్సభ స్థానాలకు ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది.
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చింది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. పోలింగ్ సిబ్బంది ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్టుమెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తెస్తారు.