బిఆర్ఎస్ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారందరిపై అనర్హత వేటు వేయాలని, పలు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కూడా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు పిటిషన్లు అందజేశారు. బీఆర్ఎస్ బీ ఫాంపై గెలుపొంది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు.
అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. వీటిన్నింటిపై దృష్టి సారించి, పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీశ్రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద గౌడ్ ఉన్నారు.