Wednesday, October 2, 2024
HomeUncategorizedఅవినీతి అధికారులను వేటాడుతున్నారు..

అవినీతి అధికారులను వేటాడుతున్నారు..

Date:

తెలంగాణలో అవినీతిపరులు, అక్రమంగా కోట్ల రూపాయలు కూడబెట్టిన అక్రమార్కులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరిని వేటాడుతోంది. అనుమానం వచ్చిన ప్రతి శాఖపై నిఘా పెడుతోంది. కొన్ని శాఖల్లో మారువేషంలో వెళుతూ అవినీతిపరుల ఆటకట్టిస్తున్నారు.. ఏసీబీ అనే మూడు అక్షరాల పేరు వింటే చాలు తప్పు చేసిన వారికి వణుకుపుడుతోంది..

ముందడుగు ప్రత్యేకం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వేటాడుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసిన వారిని టార్గెట్‌ చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్‌ చేసి మరీ పట్టుకుంటోంది. ఐదు నెలల్లో దాదాపు 50కి మందికిపైగా అధికారులపై కేసులు ఫైల్ చేసింది. అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమాఖమహేశ్వరావుకు చిప్పకూడు తినిపించారు. ఫిర్యాదుదారుడు, నిందితుడు.. ఇద్దరి నుంచీ డబ్బు వసూలు చేయడంలో ఉమామహేశ్వరరావు మార్కే డిఫరెంట్. ల్యాండ్ సెటిల్మెంట్ కేసుల్లో ఉమామహేశ్వరరావు బాగా దండుకున్నట్టు గుర్తించారు విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెపుతున్నారు.

గత జనవరిలో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. నాంపల్లి ఇరిగేషన్‌ కార్యాలయంలో దాడులు చేసి నలుగురు ఇరిగేషన్‌ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్‌తో పాటు ఇద్దరు ఏఈలు, సర్వేయర్‌ను ట్రాప్ చేశారు. నలుగురు ఇరిగేషన్‌ అధికారులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. హైదరాబాద్‌ కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ కేసు విషయంలో 3లక్షలు లంచం తీసుకుంటూ సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న ఆర్టీఐ కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెట్టింది. లారీ, టాక్సీ డ్రైవర్ల గెటపుల్లో ఆఫీసుల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్రమార్కుల భరతం పడుతున్నారు. మహబూబాబాద్​ ఆర్టీఏ ఆఫీస్‌లో పని చేస్తున్న ఐదుగురు ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, నాగోల్‌, అత్తాపూర్,బండ్లగూడ, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేశారు. పలువురు బ్రోకర్లతో పాటు అవినీతి అధికారులను అదుపులో తీసుకుని విచారించారు. మహబూబ్ నగర్, నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది.

కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో రూ. 25వేలు లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీ దొరికిపోయింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో 20 వేలు లంచం తీసుకుంటూ హుజురాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఏసీబీకి చిక్కాడు. లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆశాఖ, ఈశాఖ అనే తేడా లేకుండా ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతున్నారు.