కేంద్ర హోంమంత్రి అమిత్షాను ప్రధానిని చేసేందుకు మోడీ ఓట్లడుగుతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ను కూడా తొలగిస్తారని జోస్యం చెప్పారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో కలిసి నిర్వహించిన సంయుక్త ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మనీలాండరింగ్ కేసులో విడుదలైన తర్వాత తొలిసారి కేజ్రీవాల్.. మోదీ రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. దీన్ని అమిత్ షా ఖండించారు. అధికారంలోకి వస్తే మూడోసారీ మోదీనే ప్రధానిగా కొనసాగుతారని చెప్పారు. మరో మూడు విడత ఎన్నికలు మిగిలిన ఉన్న వేళ దీని గురించి మరోసారి కేజ్రీవాల్ మాట్లాడారు.
”యూపీ ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. అమిత్ షాను ప్రధాన మంత్రిని చేసేందుకే మోదీ ఓట్లడుగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 నాటికి ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. మళ్లీ గెలిస్తే తన వారసుడిగా అమిత్ షాను మోదీ కూర్చోబెడతారు. ఎందుకంటే ఈ నిబంధన పెట్టిందే ఆయన. కాబట్టే దీని గురించి ఎక్కడా మోదీ మాట్లాడడం లేదు. అంతే కాదు.. ఒకవేళ మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే రెండు మూడు నెలల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తారు. రాజ్యాంగాన్ని మార్చేసి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తారు” అని కేజ్రీవాల్ అన్నారు.