15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedపేద‌ల జీవితాల‌ను ఆగం చేస్తున్న కాంగ్రెస్‌

పేద‌ల జీవితాల‌ను ఆగం చేస్తున్న కాంగ్రెస్‌

Date:

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రో బుల్డోజ‌ర్ రాజ్యంగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని బిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌లో ఉన్న‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయం, చట్టం ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చటం అమానవీయం, అన్యాయం అని గతంలో మీరే అన్నారని ప్రస్తావించారు.

కాంగ్రెస్ అధినేత ఖర్గే మాటలను గుర్తు చేస్తూ ప్రశ్నించిన కేటీఆర్.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ ఆ కుటుంబాలను నిరాశ్రయులు చేస్తున్నారని ఆక్షేపించారు. దీనికి మీ సమాధానం ఏమిటి?అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన ఘటనను ‘ఎక్స్‌’ వేదికగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మీ ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని తెలిపారు. 40 ఏళ్ల కిందట, 20 ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకొని నివాసం ఉన్న పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేస్తుండటం ఎంత అమానవీయమో ఖర్గే చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రం మరో బుల్డోజర్ రాజ్యం కాకుండా మీ పార్టీ ప్రభుత్వానికి సూచన చేయలంటూ ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.