15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedదాదాపు 30వేల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం

దాదాపు 30వేల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం

Date:

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం మహబూబాబాద్‌ జిల్లాలో నమోదైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో పర్యటించిన సిఏం, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. దాదాపు 30వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని వెల్లడించారు. సహాయచర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అభినందించారు.

”అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగాం. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించాం. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తాం. నష్టపోయిన మూడు తండాలవాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలి. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోదీని ఆహ్వానించాం. తక్షణమే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి. వర్షం తగ్గినందున బురద తొలగించే పనులు అధికారులు ప్రారంభించాలి. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చు. విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది.. మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎంత ఒత్తిడి ఉన్నా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నాం. ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఆక్రమణలకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయి. పేదల ప్రాణాలు పోయాక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదు. పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేయగలరా? ఆక్రమణల తొలగింపునకు హరీశ్‌రావు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? చెరువులను ఆక్రమించిన వారు ఎంతటివారైనా తొలగించాల్సిందే. ఆక్రమణల తొలగింపునకు విధివిధానాలు రూపొందించాలి”అని సీఎం రేవంత్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.