తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పని వేళలకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యాశాఖ పనివేళల మార్పు గురించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ యథావిధిగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కూడా యథావిధిగా ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల నిర్వహణ కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు.