తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్కే మేలు జరుగుతుంది. ఉద్యమకాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుంది. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది.. రానున్న రోజులు మనవే. పార్లమెంట్లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది. రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్కు నష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటల వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. సిద్దిపేట, వరంగల్లో లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.