15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedఅద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు..

అద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు..

Date:

తెలంగాణ రాష్ట్రంలో పిల్ల‌ల‌కు, బాలింత‌ల‌కు, గ‌ర్భిణీల‌కు పౌష్టికాహ‌రాన్ని అందిస్తున్నామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెపుతోంది.. అందుకు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తి వీధిలో అంగ‌న్‌వాడీల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని, బ‌ల‌మైన ఆహారాన్ని కూడా అందిస్తున్నామ‌ని అంటున్నారు. తెలంగాణ అంగ‌న్ వాడీ కేంద్రాల్లో ఏలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. ఎన్ని అంగ‌న్ వాడీ కేంద్రాలు నిర్మించారు, ఎన్ని అంగ‌న్‌వాడీ కేంద్రాలు అద్దెల్లో ఉన్నాయ‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ మ‌హిళ శిశు సంక్షేమ శాఖ‌కు స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేయ‌గా వారు స‌మాచారం అందించారు.

అంగ‌న్ వాడీ కేంద్రాల ద్వారా 7 నెల‌ల నుంచి 3సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌కు సూక్ష్మ పోష‌కాల‌తో ఫోర్టిప్యేడ్ చేయ‌బ‌డిన రోస్ట్ గోధుమ‌లు, వేయించిన శ‌న‌గ‌ప‌ప్పు, పాల‌పొడి, చెక్క‌ర‌, ఆయిల్‌, మెత్త‌గా పొడి చేసిన  ఎంటిఎఫ్ లేదా బాలామృతం. ఒక్కొక్క ల‌బ్ధిదారున‌కు, ఒక్క రోజుకి 100 గ్రాముల చొప్పున 25రోజుల‌కు ప్ర‌తినెల మొద‌టి రోజున రెండున్న‌ర కిలోల ప్యాక్ పంపిణీ చేయ‌బ‌డును మ‌రియు వారానికి 4 చొప్పున నెల‌కి 16 గ్రుడ్లు ఇవ్వ‌బ‌డును.

3సంవ‌త్స‌ర‌ముల నుంచి 6 సంవత్స‌రాల పిల్ల‌ల‌కు అంగ‌న్ వాడీ కేంద్రంలో ప్ర‌తిరోజు (75 గ్రా బియ్యం, 15గ్రా పప్పు, 5గ్రా ఆయిల్‌, 25గ్రా కూర‌గాయ‌ల‌తో) వేడి భోజ‌నం అందించ‌బ‌డును మ‌రియు 20 గ్రాముల స్నాక్స్ ప్ర‌తి రోజు మ‌రియు వారానికి 4 గ్రుడ్లు చొప్పున నెల‌కి 16 గ్రుడ్లు అందించ‌బ‌డును.

గ‌ర్బిణీ స్త్రీలు, బాలింత‌ల‌కు ఒక సంపూర్ణ భోజ‌నం పెట్ట‌బ‌డును. సంపూర్ణ భోజ‌నం అంటే 150 గ్రాముల అన్నం, 30 గ్రాముల ప‌ప్పు, 16గ్రాముల ఆయిల్‌, 50 గ్రాముల ఆకుకూర‌ల‌తో పాటు 200మి,లీ పాలు, ఒక గ్రుడ్డు ప్రతిరోజు అంగ‌న్ వాడీ కేంద్రం వ‌ద్ద ఇవ్వ‌బ‌డును.

అంగ‌న్ వాడీ కేంద్రాలు..

తెలంగాణ‌లో మొత్తం అంగ‌న్‌వాడీ కేంద్రాలు 35700 ఉన్నాయి. ఇందులో మెయిన్ 31711 కాగా, మినీ 3989 ఉన్నాయి. మెయిన్ అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు ప్ర‌తి నెల మెయింట్‌నెన్స్ కింద 2000 ఇస్తుండ‌గా, మినీ అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు 1000 ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టికి 12221 అంగ‌న్ వాడీ కేంద్రాలు ఇంకా అద్దె భ‌వ‌నాల్లోనే న‌డుస్తున్నాయ‌ని మ‌హిళ శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ స‌మాచారం ఇచ్చార‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ పౌండ‌ర్ రాజేంద్ర తెలిపారు.