మన దేశంలోని కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవ పరిస్ధితి ఇలా ఉంటే మనం సూపర్ పవర్ కావడం గురించి ఎలా మాట్లాడతామని ప్రశ్నించారు. కేరళలోని కొట్టాయంలో గురువారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ మన రైతులు సాయం కోసం అరుస్తున్నారని, యువత ఉద్యోగాల కోసం పాకులాడుతున్నారని, ఈ పరిస్ధితిల్లో మనం సూపర్ పవర్ కాగలమా అని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే జాతి, ఒకే భాషను రుద్దాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ గాంధీ అంతకుముందు దుయ్యబట్టారు. కేరళలోని కన్నూర్లో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
భారత్ వైవిధ్యతను కాంగ్రెస్, యూడీఎఫ్ ఆమోదిస్తాయని, తాము భిన్న భాషలను, భిన్న సంస్కృతులను, భిన్న చరిత్రను గౌరవిస్తామని చెప్పారు. దేశ ప్రజల భిన్నమైన భావాలను గుర్తెరిగి అంగీకరిస్తామని అన్నారు. ఉదాహరణకు కేరళ నుంచి మళయాళాన్ని తొలగిస్తే రాష్ట్రంలోని మహిళ తన పిల్లలకు ఈ భూమి గొప్పతనం గురించి ఎలా వివరించగలదని రాహుల్ ప్రశ్నించారు. అందుకే భిన్న భాషలు, సంస్కృతులు, చరిత్రను తాము ఆమోదిస్తామని వివరించారు. ఇందుకు విరుద్ధంగా కాషాయ పార్టీ భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధికి పాకులాడుతోందని విమర్శించారు.