Wednesday, October 2, 2024
Homeజాతీయంస‌న్యాసులుగా మారాల‌నీ ఎవ‌రిని అడ‌గం

స‌న్యాసులుగా మారాల‌నీ ఎవ‌రిని అడ‌గం

Date:

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ తన కుమార్తెకు వివాహం చేసిన ఇతరుల పిల్లలను సన్యాసినులుగా ఎందుకు మార్చాలనుకుంటున్నారని మద్రాసు హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఈశా ఫౌండేషన్‌ స్పందించింది. పెళ్లి చేసుకోమని కానీ, సన్యాసులుగా మారాలని కానీ తాము ఎవరినీ అడగమని స్పష్టం చేసింది. ఇవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయాలని పేర్కొంది.

”ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించడానికి ఈశా ఫౌండేషన్‌ను సద్గురు స్థాపించారు. వ్యక్తులకు ఆయా మార్గాలను ఎంచుకునేందుకు స్వేచ్ఛ, జ్ఞానం ఉంటాయని మేం నమ్ముతున్నాం. పెళ్లి చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ మేం ఎవరినీ అడగం. ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలు. ఈశా యోగా సెంటర్‌లో వేలాది మంది ఉన్నారు. వారెవరూ సన్యాసులు కారు. బ్రహ్మచర్యం తీసుకున్న వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అయినప్పటికీ ఈ కేసులో పిటిషనర్‌ సన్యాసులను కోర్టు ముందు హాజరుకావాలని కోరారు. దీంతో వారు కోర్టులో హాజరై తాము ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. సత్యం గెలుస్తుందని మేం భావిస్తున్నాం. అనవసరమైన వివాదాలకు ముగింపు త్వరలో లభిస్తుంది’ అని ఈశా ఫౌండేషన్‌ వివరణ ఇచ్చింది.