15.3 C
London
Monday, September 16, 2024
HomeUncategorizedమాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

Date:

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ నుంచి తొలగించింది. ఐఏఎస్‌ (ప్రొబేషన్‌) రూల్స్‌, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాయి. పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ.. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్‌ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

ఇటీవల కోర్టు విచారణ సమయంలో యూపీఎస్సీ చేసిన వాదనలను పూజా తోసిపుచ్చారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. ”డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు మాత్రమే అఖిల భారత సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలు ఉంది” అని వాదించారు. ఈ క్రమంలోనే ఆమెను తొలగిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది.