Wednesday, October 9, 2024
Homeజాతీయందేశంలో విష బీజాలు నాటుతున్న కాంగ్రెస్

దేశంలో విష బీజాలు నాటుతున్న కాంగ్రెస్

Date:

సమాజంలో కాంగ్రెస్ విష బీజాలు నాటుతూ.. హిందువులను విభజించాలని చూస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. హరియాణా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(భాజపా) విజయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ కాంగ్రెస్ చేసిన కుట్రలన్నీ విఫలమయ్యాయని అన్నారు. మహారాష్ట్రలో రూ.7,600 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

హరియాణా ఎన్నికల్లో భాజపా చారిత్రాత్మక విజయం దేశ ప్రజల ఆలోచనను తెలియజేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితులు భాజపాకు అండగా నిలిచారని పేర్కొన్నారు. “కాంగ్రెస్ తమ రిజర్వేషన్లను లాక్కొని తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని దళితులు గ్రహించారు. దేశంలోని రైతులను కూడా కాంగ్రెస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ, తమకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) ఎవరు ఇచ్చారో హరియాణా రైతులకు తెలుసు కాబట్టే వారు భాజపాను గెలిపించారు. ప్రజలు కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పారు” అని మోదీ అన్నారు.