Friday, September 20, 2024
Homeజాతీయంతెలంగాణలో రుణమాఫీ చేయని కాంగ్రెస్

తెలంగాణలో రుణమాఫీ చేయని కాంగ్రెస్

Date:

అర్బన్‌ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్‌ కాంగ్రెస్‌ను నడిపిస్తోందని, ఇప్పుడున్నది గతంలోని కాంగ్రెస్‌ కాదని, ఆ పార్టీలో దేశభక్తి, స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన కార్యక్రమంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు. గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని మోడీ పునరుద్ఘాటించారు.

“నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోంది. స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ నాయకత్వంలో దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన మీ అందరికీ తెలుసు. ప్రజలు పూజించిన దేవుని విగ్రహాన్ని పోలీసు వ్యాన్‌లో బంధించారు. ఈ విషయంపై కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా మౌనంగా ఉండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కాబట్టి మనమంతా ఏకమై కాంగ్రెస్‌ చేస్తున్న పాపాలకు తగిన బుద్ధి చెప్పాలి” అని మోడీ అన్నారు.