Tuesday, October 22, 2024
Homeజాతీయంకొత్తగా పెళ్లైన జంటలు 16మంది పిల్ల‌ల‌ను క‌నాలి

కొత్తగా పెళ్లైన జంటలు 16మంది పిల్ల‌ల‌ను క‌నాలి

Date:

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 16 రకాల సంపదలకు బదులుగా 16 మంది పిల్లలను కనాల్సిన సమయం వచ్చిందని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఆ రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ సోమవారం సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించింది. సీఎం స్టాలిన్ సమక్షంలో 31 జంటలకు వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. 16 మంది పిల్లలను కనాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు.

పూర్వ కాలంలో కొత్తగా పెళ్లైన జంటలు 16 రకాల సంపదలు పొందాలని పెద్దలు ఆశీర్వదించేవారని సీఎం స్టాలిన్‌ గుర్తు చేశారు. ‘మీకు 16 కలిగి సుభిక్షంగా జీవించాలని పెద్దలు కోరుకునేవారు. అంటే 16 మంది పిల్లలు కాదు, 16 రకాల సంపదలను సూచిస్తుంది. వీటిని ‘ఆవు, ఇల్లు, భార్య, పిల్లలు, విద్య, జిజ్ఞాస, జ్ఞానం, క్రమశిక్షణ, భూమి, నీరు, వయస్సు, వాహనం, బంగారం, ఆస్తి, పంట, ప్రశంసలు’ అని రచయిత విశ్వనాథన్ తన పుస్తకంలో పేర్కొన్నారు’ అని తెలిపారు. మరోవైపు పెళ్లైన కొత్త జంటలను 16 రకాల సంపదలు పొందాలని ఇప్పుడు ఎవరూ ఆశీర్వదించడం లేదని స్టాలిన్‌ అన్నారు. తగినంత సంతానం కలిగి సుఖంగా జీవించాలని మాత్రమే అనుగ్రహిస్తారని చెప్పారు. అయితే పార్లమెంటరీ నియోజక వర్గాలను తగ్గించే అవకాశం ఉన్నదని తెలిపారు. ‘మీరు ఆశ్చర్యపోయేలా 16 మంది పిల్లలను మనం కలిగి ఉండాలన్న పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ విషయాన్ని మరచిపోవద్దు’ అని అన్నారు.