Tuesday, October 1, 2024
Homeజాతీయంఅక్ర‌మంగా ఏ ప్రార్థ‌నా మందిరం ఉన్నా కూల్చండి

అక్ర‌మంగా ఏ ప్రార్థ‌నా మందిరం ఉన్నా కూల్చండి

Date:

దేశంలో ప్రజల సురక్షితమే అత్యున్నత అంశమని.. రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్‌ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్‌ బీఆర్‌ గవయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ నేతృత్వంలోని బెంచి విచారించింది. భారత్‌ సెక్యూలర్‌ దేశమని.. ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్‌తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని బెంచ్‌ పేర్కొంది.

యూపీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్‌ చర్యలు తీసుకోవడానికి ఆధారమా..? అని ఆయన్ను బెంచ్‌ ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ.. ”కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందే జరిగిఉంటేనే చర్యలు తీసుకొంటాం” అని పేర్కొన్నారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగా న్యాయస్థానం మార్గదర్శకాలు జారీచేసిందని తాను ఆందోళన చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు.

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ”మనది సెక్యూలర్‌ దేశం. మా మార్గదర్శకాలు జాతిమతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే చెప్పాం. ఏదైనా మత సంబంధమైన నిర్మాణం రోడ్డు, ఫుట్‌పాత్‌, జలాశయం, రైలు పట్టాపై ఉంటే అది ప్రజలకు అడ్డంకి కాదా. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికీ ఒక్కటే చట్టం” అని వ్యాఖ్యానించింది.