ఢిల్లీకి చెందిన సివిల్స్ విద్యార్థి ఒకరు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్కి లేఖ రాశాడు. సివిల్స్ విద్యార్థి అవినాశ్ దూబే ఓల్డ్ రాజేంద్రనగర్లోని ఐఏఎస్ స్టడీ సెంటర్లో ఉన్న లోపాలను లేఖలో వివరించాడు. ”ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ విద్యనభ్యసించడమనేది మా ప్రాథమిక హక్కు. నీటి ఎద్దడి, వరదల కారణంగా విద్యార్థుల భద్రతకు ముప్పు వాటిల్లితోంది. మాకు సురక్షితమైన వాతావరణం అవసరముంది. అప్పుడే నిర్భయంగా చదువుపై దృష్టి సారించగలం. దేశ అభివృద్ధిలో భాగమవ్వగలం” అని పేర్కొన్నాడు.
తమతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేలవమైన మౌలిక సదుపాయల గురించి వెల్లడించాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షాలు పడినప్పుడల్లా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాడు. నిబంధనలను ఉల్లంఘించి బేస్మెంట్లను లైబ్రరీలుగా మార్చారని.. వారి నిర్లక్ష్యం వల్లే ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించాడు. తామంతా నరకంలో జీవిస్తున్నట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థుల మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు.
ఇటీవల ఢిల్లీలో రావూస్ స్టడీ సర్కిల్లోని బేస్మెంట్లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల ఆందోళనతో కోచింగ్ సెంటర్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.