దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వేసవితాపాన్ని తాళలేక తల్లడిల్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో వడదెబ్బ తగిలి ఎన్నికల విధుల్లో ఉన్న ఆరుగురు జవాన్లు మరణించారు.
శుక్రవారం 23 మంది జవాన్లు వడదెబ్బతో మా ఆస్పత్రిలో చేరారని, వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని మిర్జాపూర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్బీ లాల్ చెప్పారు. మరణించిన జవాన్లలో తీవ్ర జ్వరం, హై బీపీ లెవల్స్, హై షుగర్ లెవల్స్ ఉన్నాయని, అదే మరణానికి కారణమైందని అన్నారు.
బీపీ, షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఆర్బీ లాల్ చెప్పారు. వడదెబ్బ తగిలిన జవాన్లు అందరూ ఇక్కడ ఎన్నికల్లో ఉన్నట్లు చెప్పారని, తమ దగ్గరికి రావడానికి ముందు వాళ్లు సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారని అన్నారు.