లా కోర్సుకు ”మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టేయండి” అంటూ పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ”వాస్తవానికి న్యాయవిద్యకు ఐదేళ్ల కోర్సు కూడా తక్కువే. అయితే ప్రస్తుత విధానం సరిగ్గానే పనిచేస్తోంది. దీనిపై ఆలోచించడానికి ఏం లేదు. ఇక, ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థల్లో 70శాతం మంది మహిళలు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింతమంది ఇందులో చేరుతారు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ప్రస్తుతం.. డిగ్రీ పూర్తి చేసినవారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. అయితే, ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పేదలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.