మహారాష్ట్ర ప్రస్తుత సీఎం షిండే, మాజీ సీఎం ఉద్దేవ్ ఠాక్రాను మోసం చేసి, వెన్నుపోటు పొడిచారని, హిందూ మతంలో మోసాన్నిపెద్ద పాపంగా పరిగణిస్తారని, మోసం చేసేవాడు హిందువు కాదు అని ఇటీవల జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంపీ కంగనా రనౌత్ తప్పుపట్టారు. శివసేన నేత, సీఎం ఏకనాథ్ షిండేకు ఆమె మద్దతుగా నిలిచారు.
అవిముక్తేశ్వరానంద స్వామికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ కంగనా.. రాజకీయాల్లో రాజకీయవేత్త రాజకీయం చేయకుంటే .. పానీ పురీ అమ్ముకుంటాడా అని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో కూటమిలు ఏర్పాటు చేయడం, పార్టీలో విభేదాలు రావడం ఇవన్నీ కామన్ అన్నారు. 1907, 1971లో కాంగ్రెస్ పార్టీలో చీలకలు వచ్చినట్లు ఆమె తెలిపారు. శంకరాచార్య తన మాటలను తప్పుగా వాడారని, ఒకవేళ రాజు దోచుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు అది దేశద్రోహం అవుతుందని మతం పేర్కొన్నట్లు ఆమె వెల్లడించారు. ఏక్నాథ్ షిండేను ద్రోహి అంటూ మనందరి మనోభావాలను శంకరాచార్య దెబ్బతీశారని కంగనా తెలిపారు. అనుచిత అంశాలను వెల్లడిస్తూ హిందూ మత గౌరవాన్ని శంకరాచార్య కించపరుస్తున్నారని ఆమె అన్నారు. 2022 జూన్లో శివసేన(యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి.. బీజేపీ సపోర్టుతో ఏకనాథ్ షిండే సీఎం అయ్యారు.