ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో ఒకటి మైక్రోసాఫ్ట్. ఆ కంపెనీలో జాబ్ వస్తే చాలు అని కలలు కనేవారు కోట్లలో ఉంటారు. కోట్లు, లక్షల్లో శాలరీలు వస్తుంటాయి. అందువల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ల లైఫ్ హ్యాపీగా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేస్తున్న పని చూసి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న అతను.. వీకెండ్లో ఆటో నడుపుతున్నాడు.
ఎందుకిలా?
ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్కి సంబంధించి ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అందులో కొంత వివరణ ఇచ్చారు. “నేను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నాను. 35 ఏళ్ల డ్రైవర్ పిక్ చేసుకున్నాడు. అతను మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హూడీని వేసుకొని ఉండటంతో చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకిలా అని అడిగితే తాను మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ననీ, ఒంటరితనాన్ని భరించలేక, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీకెండ్లో ఆటో నడుపుతున్నానని చెప్పాడు” అని తెలిపారు. ఆటో ద్వారా ప్రజలతో మాట్లాడుతూ, ఒంటరితనం నుంచి ఉపశమనం పొందుతున్నానని అతను చెప్పినట్లు నెటిజన్ వివరించారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది నిజమేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. “బ్రో ఇతను నారాయణ మూర్తి సలహాను తీసుకున్నట్లున్నాడు” అని మరో యూజర్ సెటైర్ వేశారు. “ఇది నిజం అయ్యే అవకాశమే లేదు” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. బ్లూస్క్రీన్ కొనసాగుతున్నట్లుంది అని మరో యూజర్ స్పందించారు. మొత్తంగా ఆ వ్యక్తి నిజంగానే మైక్రోసాఫ్ట్ ఇంజినీరేనా అనే దానిపై క్లారిటీ లేదు.