కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మరణించారు. భారత్లోనూ కరోనాతో 5.3లక్షల మంది మృతిచెందారు. కొవిడ్ సమయంలో భారత్లో మరణాల సంఖ్య నివేదించిన దాని కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు ఓ అంతర్జాతీయ అధ్యయం తాజాగా వెల్లడించింది. 2020లో 11.9 లక్షల అధిక మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఈ అధ్యయనాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తప్పుదోవ పట్టించే నివేదిక అని కొట్టిపారేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికను విశ్లేషించి భారత్లో కరోనా విజృంభణ సమయంలో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కొన్ని మీడియా కథనాలు ఈ అధ్యయనాన్ని ప్రచురించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ అధ్యయనం చేసిన అంచనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. లోపభూయిష్టమైన పద్ధతిలో వారు చేసిన అధ్యయనం ఆమోదయోగ్యం కాదు. ఎన్ఎఫ్హెచ్ఎస్ నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి ఆపాదించలేం. దేశంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అత్యంత విశ్వసనీయమైనది. దేశంలో 99 శాతం మరణాలు ఇందులో రికార్డ్ అవుతాయి. దీని ప్రకారం 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74లక్షలు పెరిగాయి. అంతకుముందు రెండు సంవత్సరాల్లోనూ (2018లో 4.86లక్షలు, 2019లో 6.90లక్షల పెరుగుదల) మరణాల్లో ఇలాంటి అత్యధిక పెరుగుదల నమోదైంది. అధికంగా నమోదైన మరణాలన్నింటికీ కొవిడ్ మహమ్మారి కారణమని చెప్పలేం. ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ ఉంటాయి” అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.