కోల్కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారిని కార్యాలయం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో (దాదాపు 200 మంది) కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష (భాజపా) నేత సువేందు అధికారి ఇటీవల రాష్ట్ర గవర్నర్ సి.వి.ఆనంద బోస్ను కలిసేందుకు వెళ్లారు. అయితే.. ఆయనను అక్కడున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. రాజ్భవన్ వెలుపల 144 సెక్షను అమలులో ఉన్నందున గుంపుగా రావడాన్ని అనుమతించమని తేల్చి చెప్పారు. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంటు కూడా తీసుకున్నానని.. బాధితులకు న్యాయం చేయాలని కోరేందుకే వచ్చామని ఎంత చెప్పినా వినిపించుకోలేదు.
గంటసేపు ఎదురుచూసినా లోనికి అనుమతించలేదు. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో పోలీసుల తీరుపై గవర్నర్ మండిపడ్డారు. తన ఆదేశాలను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. వారు ఇక్కడ ఉంటే తాను సురక్షితంగా ఉన్నానన్న భావన కలగడం లేదన్నారని సమాచారం. దీంతో తక్షణమే పోలీసు సిబ్బంది సహా ఇన్ఛార్జి అధికారిని రాజ్భవన్ ప్రాంగణాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజ్భవన్ ఉత్తర ద్వార సమీపంలో ఉన్న ఔట్పోస్టును ‘జన్ మంచ్’ (ప్రజావేదిక)గా మార్చేందుకు ఆనంద్ బోస్ యోచిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.