ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్పై అవినీతి ఆరోపణల వ్యవహారంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక, భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. ఈమేరకు అధికారులు బుధవారం వెల్లడించారు.
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఖేడ్కర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది.
‘జులై 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించాం. కానీ, ఆమె ఆగస్టు 4 వరకు గడువు కావాలని కోరింది. ఇందుకు తిరస్కరించి.. జులై 30 వరకు అదనపు సమయం కల్పించాం. ఇదే చివరి అవకాశమని.. ఎలాంటి పొడిగింపులు ఉండవని స్పష్టంచేశాం. కానీ, ఆమె గడువులోగా తమ సమాధానాన్ని సమర్పించలేదు. అందువల్ల సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2022లో ఆమె ప్రొవిజినల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నాం. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు/ఎంపికలకు హాజరుకాకుండా శాశ్వతంగా డిబార్ చేస్తున్నాం” అని యూపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.