సార్వత్రిక ఎన్నికల తొలి విడతలో భాగంగా చత్తీస్ఘడ్లోని బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్ జరిగింది. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని మావోలు పిలుపు ఇచ్చారు. కానీ చాలా వరకు గ్రామాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కానీ కరుడుకట్టిన నక్సల్ నేత హిడ్మాకు చెందిన పువర్తి గ్రామంలో ప్రజలు ఎవరూ ఓటు హక్కును వినియోగించుకోలేదు. బస్తర్ ప్రాంతంలో జరిగిన అనేక నక్సల్స్ దాడుల్లో హిడ్మా పాత్ర ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆ నియోజకవర్గంలో 67.56 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. కానీ పువర్తి గ్రామ పోలింగ్ బూత్ నుంచి ఎవరూ ఓటు హక్కును వాడుకోలేదని తెలిసింది. భయం వల్ల గ్రామస్థులు ఓటు వేయలేదని బూత్ లెవల్ ఆఫీసర్ తెలిపారు. పువర్తి పోలింగ్ బూత్ కింద మూడు గ్రామాలు ఉన్నాయి. దాంట్లో పువర్తి, టేకల్గూడమ్, జొన్నగూడ ఉన్నాయి. పువర్తిలో 332 మంది, టేకుల్గూడంలో 158 మంది, జొన్నగూడలో 157 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పువర్తి గ్రామంలో ఉన్న బూత్ నుంచి ఒక్కరు కూడా ఓటు వేయలేదు.