దేశంలో లోక్సభ ఎన్నికల తర్వాత టెలికాం రంగంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ త్వరలో అమలు చేయనుంది. ఈ విషయంపై డాట్కు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో సిఫార్సు చేసింది. ఈ మార్పులు లోక్సభ ఎన్నికల తర్వాత అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.
నకిలీ సిమ్ కార్డ్లు, సైబర్ మోసాలు విజృంభిస్తున్న తరుణంలో వీటిని నిరోధించడానికి కొత్త రూల్స్ ఉపయోగపడనున్నాయి. దీని ప్రకారం.. కొత్త కనెక్షన్ను అందించాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ గుర్తింపు తప్పనిసరి. అటువంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించడంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా టెలికాం కంపెనీలకు స్పష్టమైన మార్గదర్శకాలు డాట్ జారీ చేయనుంది. వీటితో పాటు స్పెక్ట్రమ్ కేటాయింపులు, శాటిలైట్ కమ్యూనికేషన్కు సంబంధించిన నిబంధనలు తీసుకురానున్నారు. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే.. సదరు కంపెనీలు ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సిఉంటుంది. టెలికమ్యూనికేషన్స్ చట్టంలోని వివిధ సెక్షన్లలో పేర్కొన్న నిబంధనలను సెప్టెంబర్ 15 నాటికి అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది.