ఉపాధి కోసం అరబ్ దేశం యూఏఈలోని దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తికి అదృష్టం వరించింది. నెల నెలా తాను చేసిన పొదుపుతో ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. సేవింగ్స్ స్కీమ్ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో అతడు విజేతగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో యూఏఈ వెళ్లారు. దుబాయ్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న ఆయన 2019 నుంచి తాను సంపాదించిన దాంట్లో నుంచి ప్రతి నెలా 100 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ను నేషనల్ బాండ్స్లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ప్రోగ్రామ్ కింద లక్కీ డ్రా తీస్తారు.
గ్రాండ్ ప్రైజ్ కేటగిరీలో తీసిన లాటరీలో నాగేంద్రమ్ విజేతగా నిలిచారు. నగదు బహుమతి కింద 1 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఈ ప్రైజ్మనీపై ఆంధ్రా వాసి అంతులేని ఆనందం వ్యక్తం చేశారు. తన పిల్లల ఉన్నత చదువుల కల నెరవేరుతుందని, వారి భవిష్యత్తు భద్రంగా ఉంటుందని సంతోషపడ్డారు.