దేశంలో దాదాపు 50ఏళ్ల క్రితం అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు. ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు. మీడియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను ‘సంవిధాన్ హత్య దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం” అని అమిత్ షా రాసుకొచ్చారు.