మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని, ఇక్కడ ఉన్న సీసీఐ సిమెంట్ పరిశ్రమను మోడీ, కేసీఆర్ కలిసి మూసేశారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిచేస్తామని తెలిపారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ”నాగోబా జాతరకు రూ.4 కోట్లు కేటాయించనున్నాం. కుప్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తాం. తుమ్మిడిహట్టిలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడతాం.. దానికి బీఆర్ అంబేడ్కర్ పేరు పెడతాం. ఆదిలాబాద్లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నాం. ఉచిత బస్సుల్లో 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. పదేళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే.. కాంగ్రెస్ 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది. బీసీ జనగణన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. తొందరల్లోనే దీన్ని తెరిపిస్తాం. రూ.500కే మేం గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని వాళ్లిద్దరూ అంటున్నారు. ఉచిత కరెంటుతో పేదల ఇళ్లు వెలుగుతుంటే వాళ్ల కడుపు మండుతోంది. గత ప్రభుత్వ పాలనలో పండించిన ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల్లోనే చనిపోయారు” అని రేవంత్రెడ్డి అన్నారు.