తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా కలవడానికి అనుమతించట్లేదని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “సీఎం కేజ్రీవాల్ను మానసికంగా కుంగదీయడానికి కుట్ర జరుగుతోంది. ఆయన తన కుటుంబసభ్యులతో మాట్లాడడానికి గాని, వ్యక్తిగత సమావేశాలకు గాని అనుమతించట్లేదు. వారిని ములాకత్ జంగ్లా ద్వారా మాత్రమే కలవడానికి అనుమతిస్తున్నారు. ఇది అమానుషం. కరడుగట్టిన నేరస్థులకు కూడా తమ కుటుంబాలతో వ్యక్తిగతంగా మాట్లాడుకునే అనుమతిస్తారు.” అని విచారం వ్యక్తంచేశారు. కాగా సంజయ్సింగ్ ఆరోపణలపై తిహాడ్ జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఏప్రిల్ 15న కేజ్రీవాల్ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ‘ములాకత్ జంగ్లా’ ద్వారా కలవనున్నారని జైలు అధికారులు శుక్రవారం తెలియజేశారు. అయితే మంగళవారం తిహాడ్ జైలులో ముఖ్యమంత్రి, తన సతీమణి సునీతా కేజ్రీవాల్, వ్యక్తిగత కార్యదర్శి బిభవ్కుమార్ను కలిశారు. ‘ములాకత్ జంగ్లా’ అనేది జైలు లోపల ఒక గదిలో ఖైదీని, అతడిని చూడడానికి వచ్చిన వారి నుంచి వేరు చేసే ఇనుప మెష్. వారిరువురూ మెష్కి ఇరువైపులా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.