బిహార్లోని సమస్తిపుర్లో కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హెలికాప్టర్ను అధికారులు తనిఖీ చేశారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ముజఫర్పుర్, సమస్తిపుర్లలో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఖర్గే ఇటీవల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్నూ కేరళలో ఎన్నికల అధికారులు ఇటీవల తనిఖీ చేశారని ఆ పార్టీ నేత రాజేశ్ రాథోడ్ పేర్కొన్నారు. తాజాగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాపర్లో సోదాలు చేశారన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్వయంగా ఈ తనిఖీల్లో పాల్గొన్నారన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లలో చేస్తున్న సోదాలు సాధారణమైనవేనా? ఇటువంటివి ఎన్డీఏ కూటమిలోని అగ్రనేతలకూ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు.
తనిఖీలకు సంబంధించి రికార్డులను ప్రజలముందు ఉంచాలని.. లేదంటే విపక్ష నేతలను అడ్డుకునే లక్ష్యంతో ఇవి చేస్తున్నట్లు అర్థం వస్తుందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు. ఇప్పటివరకు తనిఖీలు చేసిన నేతలందరి వీడియోలనూ విడుదల చేయాలని అన్నారు. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని నీలగిరిలో ఇటీవల రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో నీలగిరిలో ల్యాండ్ అయిన హెలికాప్టర్ను ఎన్నికల ఫ్లయిండ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. అనంతరం అందులో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు.