ఓ గ్యాంగ్ స్టర్ కోరి సమస్యలు తెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలైన ఆనందంలో ప్రదర్శించిన ఆనందం కాసేపు కూడా లేకుండా మళ్లీ జైలు పాలయ్యాడు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన గ్యాంగ్స్టర్ హర్షద్ పాటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. అయితే, జులై 23వ తేదీన అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా హర్షద్ సన్రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.