ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారాలు చేశారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యే ఉపాస్నా మహాపాత్ర ఒడిశా అసెంబ్లీలోనే అతిపిన్న వయస్సు ఎమ్మెల్యేగా నిలిచారు. యువ ఎమ్మెల్యే మహాపాత్ర వయస్సు ప్రస్తుతం కేవలం 26 ఏళ్లు మాత్రమే. 1997 జూన్ 20న ఆమె జన్మించారు. ప్రమాణస్వీకారం అనంతరం మహాపాత్ర మీడియాతో మాట్లాడుతూ.. అతిపిన్న వయస్సులో ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యే అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం తనకు తనను ఆనందోత్సాహాల్లో ముంచెత్తిందని అమె అన్నారు. బ్రహ్మగిరి నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, శక్తివంచన లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు.