తల్లితండ్రి ఇద్దరూ సీనియర్ ఐఎఎస్ అధికారులు.. సమాజంలో మంచి గౌరవంతో పాటు, డబ్బు కూడా ఉంటుంది. వారి పిల్లలు నచ్చిన రంగాన్ని ఎంచుకోవచ్చు. అలాంటిది మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారుల కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలో ప్రధాన కార్యదర్శి వికాస్ రస్తోగి, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారి రాధిక రస్తోగిల కుమార్తె లిపి(27) సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాష్ట్ర సచివాలయ సమీప భవనంలోని పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
లిపి హరియాణాలోని సోనిపట్లో ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. ఆమె వద్ద సూసైడ్ నోట్ లభ్యమైందని అందులో తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసి ఉందని పోలీసులు తెలిపారు. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
2017లో ఇదేవిధంగా మహారాష్ట్రలోని ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ల 18 ఏళ్ల కుమారుడు ముంబయిలోని తాము నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.