ఒక వ్యక్తి ఏనుగుతో రీల్ చేసేందుకు దానిని భయపెట్టి తరిమే ప్రయత్నం చేసాడు. ఆగ్రహించిన ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. తొండంతో విసిరి కొట్టడంతోపాటు కాలుతో తొక్కి చంపింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అడవి నుంచి బయటపడిన ఒక ఏనుగు ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరించింది. గురువారం ఉదయం హబీబావాలా గ్రామానికి చేరింది. ఏనుగును చూసేందుకు గ్రామస్తులు గుమిగూడారు. బాగ్దాద్ అన్సార్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ముర్సాలీన్ ఆ ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. భయపెట్టి తరిమేందుకు దాని సమీపానికి వెళ్లాడు. ఆగ్రహించిన ఏనుగు అతడి వెంటపడింది. దీంతో ఆ వ్యక్తితోపాటు అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. అయితే ముర్సాలీన్ను సమీపించిన ఏనుగు కాళ్లతో అతడ్ని తొక్కింది. తొండంతో 25 అడుగుల ఎత్తుకు విసిరికొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఏనుగు సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఏనుగును తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ముర్సాలీన్, రీల్ రికార్డు చేసే వ్యక్తి, ఇతరులు పరుగు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.