దేశంలోని కొన్ని రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. నడుం లోతు నీటిలోనే ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
షాజహాన్పూర్లో వరద బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలపై ప్రభావం చూపింది. వరద నీరంతా ఆసుపత్రిలోకి చేరడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆసుపత్రిలో మోకాళ్ల లోతుమేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.. రోగులను వెంటనే ఇతర ఆసుపత్రులకు తరలించారు. సీఎస్సీ, పీఎస్సీ, వరుణ్ మెడికల్ కాలేజీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వారందరినీ తిరిగి వైద్య కళాశాలకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు.