ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి రాజకీయ పొత్తు ఉండదని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్ధానాల్లో తమ పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీ శ్రేణులు పార్టీ పటిష్టతకు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. విద్యుత్ ధరలను సగానికి సగం తగ్గిస్తామని హామీ ఇచ్చిన ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్ చార్జీలను రెట్టింపు చేసిందని దుయ్యబట్టారు.
కరెంటు చార్జీలను తగ్గించాలని తాము కోరుతున్నామని, ప్రభుత్వం తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న సిట్టింగ్ సీఎం ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉందని అన్నారు. కేజ్రీవాల్ను నిర్బంధించిన జైలు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోనే ఉన్నందున దీన్ని రాజకీయం చేయడం తగదని చెప్పారు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారులు చేస్తున్న ప్రకటనలను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తప్పుపట్టారు.