దేశంకోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడి భార్యపై అభ్యంతరకర పోస్టు చేసిన నెటిజన్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం దీనిపై కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆ కామెంట్లు చేసిన నెటిజన్ అకౌంట్ వివరాల కోసం సంబంధిత సోషల్ మీడియా సంస్థను సంప్రదించినట్లు తెలిపారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమాన్ సింగ్ త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఇటీవల ఆయన సతీమణి స్మృతిసింగ్ రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో యావత్ భారతదేశం అమరవీరుడి కుటుంబాన్ని కీర్తించింది. అవార్డు స్వీకరించే సమయంలో స్మృతి ముఖం చూసిన దేశ ప్రజల కళ్లూ చెమర్చాయి. కానీ కొందరు మాత్రం ఆ వీడియోపై అభ్యంతరకర కామెంట్లు పెట్టడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తి అసభ్యకరంగా చేసిన కామెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు జాతీయ మహిళా కమిషన్ను కోరారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఆ యువకుడి చర్యను తీవ్రంగా ఖండించింది. దిల్లీ పోలీసులు తక్షణమే అతడిని అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.