Tuesday, September 24, 2024
Homeఅంతర్జాతీయంశ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య

Date:

శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం. నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌కి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, మరో ఇద్దరు నేతలను క్యాబినెట్‌ మంత్రులుగా నియమించారు. దీంతో శ్రీలంకలో దిసనాయకేతో పాటు మొత్తం నలుగురితో కూడిన క్యాబినెట్‌ కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్శిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్ర లిఖించారు. మరోవైపు, ఎన్‌పీపీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్‌ నిపుణరచిచి క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయం సాధించి శ్రీలంక నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.