Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంవాహనాల నుంచి ప్రయాణీకులను దింపి కాల్చేశారు

వాహనాల నుంచి ప్రయాణీకులను దింపి కాల్చేశారు

Date:

పాకిస్థాన్‌లో కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా సంస్థ వెల్లడించింది. బలూచిస్థాన్‌లోని ఖలాత్‌ జిల్లాలో జరిగిన మరో కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పోలీసులు అధికారులు ఉన్నారు.

ముసాఖెల్ జిల్లాలోని రరాషమ్‌లోని రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు సాయుధులు దారిని అడ్డగించి, అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి, వారి గుర్తింపు తనిఖీ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. అంతేగాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మీడియా పేర్కొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.