Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంకొండచరియల కింద 2000మంది సజీవ సమాధి

కొండచరియల కింద 2000మంది సజీవ సమాధి

Date:

కొండచరియలు 2000మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య వేలల్లోకి మారింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది. ”కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు” అని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలు పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. శిథిలాల కిందే ఉండిపోయిన క్షతగాత్రుల ప్రాణాలకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు సవాల్‌గా మారింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యం, ఇతర బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్‌ సెంటర్‌ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. 

శుక్రవారం తెల్లవారుజామున ఈ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ, భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయినట్లు తేలింది. ఈ ప్రమాదం ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. పోర్గెర మైన్‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.