Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంకిలో చికెన్‌ రూ.700.. టమాట రూ.200

కిలో చికెన్‌ రూ.700.. టమాట రూ.200

Date:

పాకిస్థాన్‌లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈద్ అల్-అదా పండుగ నేపథ్యంలో అక్కడ నిత్యవసర వస్తుల ధరలు మరింత పెరిగాయి. పండ్లు, కూరగాయల ధరలు అకాశాన్ని అంటడంతో ఇదే అదనుగా ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. ఇక లాహోర్‌లోని పండ్లు, కూరగాయల విక్రేతలు టమోటా ధరలను పెంచుకుంటూ పోతున్నారు. దీంతో ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. తాజాగా టమోటాల రవాణాపై నిషేధం విధిస్తూ 144 సెక్షన్‌ను ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. పెషావర్ డిప్యూటీ కమిషనర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

పాక్‌ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మార్కెట్ ధరలు మాత్రం నియంత్రణలోకి రావడం లేదు. అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను వ్యాపారులు భేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వ ధరలను రెట్టింపు చేసి కూరగాయలను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా పచ్చిమిర్చి, నిమ్మ కాయల ధరలు రెట్టింపయ్యాయి. అల్లం, వెల్లుల్లిని 40 నుంచి 50 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిమ్మ కిలో రూ.480 చొప్పున అమ్ముతున్నారు. చికెన్‌ ధర కిలో అధికారికంగా రూ.494 ఉంటే.. వ్యాపారులు మాత్రం ఇష్టారీతిలో రూ.56లు పెంచేసి కిలో రూ520 నుంచి రూ.700లకు విక్రయిస్తున్నారు. బంగాళాదుంపల ధర కిలో 75 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. మరోవైపు పాక్‌ ప్రభుత్వం ఎ- గ్రేడ్‌ ఉల్లి ధరలను కిలో రూ.100 నుంచి 105గా నిర్ణయిస్తే.. మార్కెట్లో కిలో రూ.150గా ఉంది. గత సంవత్సరం కూడా ఈద్-ఉల్-అజా సమయంలో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.