Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయంఅమెరికాలో హెల్త్‌కేర్‌ కుంభకోణానికి పాల్పడ్డ భారతీయుడు

అమెరికాలో హెల్త్‌కేర్‌ కుంభకోణానికి పాల్పడ్డ భారతీయుడు

Date:

ఒక భారతీయుడు అమెరికాలో హెల్త్‌కేర్‌ కుంభకోణానికి పాల్పడడంతో అమెరికా న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన యోగిశ్‌ కె పంచోలి(43) మిచిగాన్‌లో నివాసముంటున్నాడు. అతడు ‘ష్రింగ్ హోమ్‌ కేర్‌’ అనే కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ కొనుగోలుకు తన వివరాలు కాకుండా ఇతరుల పేర్లు, సంతకాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మెడికేర్‌ నుంచి దాదాపు 2.8 మిలియన్‌ డాలర్లను పొందాడు. తాను ఎలాంటి సేవలు అందించకుండానే ఈ మొత్తాన్ని క్లెయిమ్‌ చేశాడు. తన స్నేహితుల సాయంతో ఈ నిధులను డొల్ల కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. అక్కడినుంచి భారత్‌లోని పంచోలి ఖాతాలోకి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కుంభకోణానికి సంబంధించి పంచోలిపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ విచారణ చేపట్టగా, అంతకుముందే నిందితుడు తన పేరును మార్చుకుని.. సాక్షిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖలకు మెయిల్స్‌ పంపించాడు. అయితే.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. హెల్త్‌కేర్‌తో మోసం, వ్యక్తిగత సమాచారం దొంగలించడం, నిధుల మళ్లింపు, సాక్షులపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని పరిగణనలోకి తీసుకొని పంచోలికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది.