Thursday, September 19, 2024
Homeక్రైంరేపిస్టుల‌కు క‌ఠిన‌శిక్ష విధించాల‌ని అసెంబ్లీ తీర్మానం

రేపిస్టుల‌కు క‌ఠిన‌శిక్ష విధించాల‌ని అసెంబ్లీ తీర్మానం

Date:

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో ట్రైనీ వైద్యురాలి ఘ‌ట‌న‌లో నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర అసెంబ్లీలో అప‌రాజిత బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఆమె ప్ర‌సంగించారు. ఆగ‌స్టు 9వ తేదీన లేడీ డాక్ట‌ర్ మృతిచెందిన త‌ర్వాత‌.. ఆ రోజే ఆమె పేరెంట్స్‌తో మాట్లాడిన‌ట్లు చెప్పారు. వాళ్ల ఇంటికి వెళ్ల‌డానికి ముందే.. ఆడియో, వీడియో, సీసీటీవీ ఫూటేజ్‌ను అంద‌జేసిన‌ట్లు చెప్పారు. ఆదివారం వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వాల‌ని ఆ డాక్ట‌ర్ పేరెంట్స్‌ను కోరామ‌ని, ఒక‌వేళ దోషిని ప‌ట్టుకోకుంటే అప్పుడు కేసును సీబీఐకి అప్ప‌గిస్తామ‌ని చెప్పామ‌న్నారు. కానీ పోలీసులు 12 గంట‌ల లోపే నిందితుడిని పట్టుకున్నార‌ని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును ప‌రిష్క‌రించాల‌ని పోలీసులకు చెప్పిన‌ట్లు సీఎం వెల్ల‌డించారు. కానీ కేసును సీబీఐకి అప్ప‌గించార‌ని, అందుకే సీబీఐ ఈ కేసులో న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని, నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష విధించాల‌ని ముందు నుంచి డిమాండ్ చేస్తున్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు.

అమ్మాయి హ‌క్కుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌తి రోజు పోరాటం చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌హిళ ప‌ట్ల జ‌రుగుతున్న వివ‌క్ష‌ను రూపుమాపేందుకు 1981లోనే ఐక్య‌రాజ్య‌స‌మితి క‌మిటీని ఏర్పాటు చేసింద‌న్నారు. ఆడ పిల్ల‌ల ర‌క్ష‌ణ కోసం గ‌ళం వినిపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ తాను కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. కోల్‌క‌తా ఆర్జీ క‌ర్ కాలేజీ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీ రెండు సార్లు లేఖ‌లు రాసిన‌ట్లు చెప్పారు. ఆయ‌న నుంచి త‌న‌కు రిప్లై రాలేద‌ని, కానీ కేంద్ర మ‌హిళ, శిశు అభివృద్ధి శాఖ నుంచి స‌మాధానం వ‌చ్చిన‌ట్లు తెలిపారు. రేపిస్టుల‌కు క‌ఠిన శిక్ష విధించాల‌ని కోరుతూ మంగ‌ళ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన అప‌రాజిత బిల్లు పాసైంది.