Wednesday, September 25, 2024
Homeక్రైంహోలీ వేడుకల్లో పలు చోట్ల విషాదఛాయలు

హోలీ వేడుకల్లో పలు చోట్ల విషాదఛాయలు

Date:

హోలీ వేడుకల్లో పలు చోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. హోలీ ఆడిన తర్వాత స్నానం చేసేందుకు వార్ధా నదికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. యువకుల మృతదేహాలను గుర్తించారు. నలుగురు యువకులు కౌటాల మండలం నదిమాబాద్‌కు చెందిన సంతోష్‌, ప్రవీణ్‌, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కౌటాల ఆస్పత్రికి తరలించారు.

ఇటు నారాయణపేట జిల్లా కేంద్రంలోని గోపాల్‌ పేట వీధిలో మినీ వాటర్‌ ట్యాంక్‌ కూలింది. ఈ ఘటనలో బాలిక చనిపోయింది. రాత్రి కామదహనం సందర్భంగా వేసిన మంటలకు పక్కనే ఉన్న మినీ వాటర్‌ ట్యాంక్‌ వేడెక్కి కూలడంతో బాలిక ప్రణతి చనిపోయింది. మరో ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నందుపల్లిలోనూ విషాదం చోటుచేసుకుంది. నందుపల్లికి చెందిన జగన్, సురేష్ హోలీ అడి స్నానం చేసేందుకు వెళ్లి పెద్ద చెరువులో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు దగ్గరికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో జగన్, సురేష్‌ మృతదేహాలను వెలికి తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెంకటాపురం మండలం లక్ష్మీపురం వద్ద (రామప్పకు వెళ్ళేదారిలో) రోడ్డు ప్రమాదం.. చెట్టుకు ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ..మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన ఉమ్మడి ఉమేష్ (22) , లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (22) మృతిచెందారు.