ఆన్లైన్ వేదికగా అవకాశం దొరికినప్పుడల్లా సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటూనే ఉన్నారు. తాజాగా నోయిడా సెక్టార్ 62లో నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ సర్వర్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ. 16.71 కోట్లు కొట్టేశారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ను తనిఖీ చేసే క్రమంలో బ్యాంక్ ఐటీ మేనేజర్ సుమిత్ శ్రీవాస్తవ ఈ దోపిడీని ఇటీవల గుర్తించారు. ఆపై దర్యాప్తులో బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయిందని వెల్లడైంది. జూన్ 17 నుంచి జూన్ 21 మధ్య ఈ డబ్బును 84 వేర్వేరు ఖాతాలకు ట్రాన్స్ఫర్ అయినట్టుగా గుర్తించారు. దోపిడీని గుర్తించిన వెంటనే శ్రీవాస్తవ నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో జులై 10న ఫిర్యాదు చేశారు. ఈ దోపిడీపై తదుపరి దర్యాప్తు విషయంలో బ్యాంక్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సాయాన్ని కూడా కోరింది.
ఎన్సీఆర్బీ పోర్టల్లో ఇప్పటికే ఫిర్యాదు నమోదవగా, ఎఫ్ఐఆర్ మాత్రం జులై 10న నమోదైందని ఎస్హెచ్ఓ ఉమేష్ చంద్ర నైతాని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ మేనేజర్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను దొంగిలించి చోరీ చేసిన నిధులను 89 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదలాయించారని సైబర్ నోయిడా ఏసీపీ వివేక్ రంజన్ రాయ్ వివరించారు.