Wednesday, October 2, 2024
Homeక్రైంపాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించిన బాలుడు

పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించిన బాలుడు

Date:

మూడేళ్ల బాలుడు పాఠశాల డ్రైనేజీలో శవమై కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన బీహార్‌ రాష్ట్రం పాట్నాలో జరిగింది. పాఠశాలకు వెళ్లిన మూడేళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి చిన్నారి ఆచూకీ కోసం గాలించారు. బాలుడి అదృశ్యంపై పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే, వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమాన పడ్డ బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో తీవ్రంగా గాలింపు చేపట్టారు. అక్కడ లోతైన డ్రైనేజీ గుంతలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు పాఠశాలకు నిప్పు పెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ స్థానికులతో కలిసి రోడ్డెక్కారు. అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. పాఠశాలకు వెళ్లే రహదారులను కూడా దిగ్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే, చిన్నారి పాఠశాలలోకి ప్రవేశిస్తున్నట్లు ఉంది కానీ, బయటకు వెళ్లడం కనిపించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పాట్నా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ చంద్ర ప్రకాశ్‌ తెలిపారు.