Friday, October 4, 2024
Homeక్రైంతండ్రిని చంపిన వ్య‌క్తిని అదే త‌ర‌హాలో చంపిన కొడుకు

తండ్రిని చంపిన వ్య‌క్తిని అదే త‌ర‌హాలో చంపిన కొడుకు

Date:

త‌న తండ్రిని చంపిన వ్య‌క్తిపై కొడుకు అదే త‌ర‌హాలో హత్య చేసి ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. తొలుత ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అది హత్యగా నిర్ధారించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్‌ 1న అహ్మదాబాద్‌ పోలీసులకు ఫోన్ కాల్‌ వచ్చింది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని 50 ఏళ్ల నకత్ సింగ్ భాటీగా గుర్తించారు. సైకిల్‌పై వెళ్తున్న అతడ్ని ఒక వాహనం ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా పోలీసులు భావించారు.

ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. వాహనం నడిపిన ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా నకత్ సింగ్‌ను ఢీకొట్టి హత్య చేసినట్లు గ్రహించారు. నిందితుడ్ని గోపాల్ సింగ్ భాటీగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు 2002లో రాజస్థాన్‌లో గోపాల్ సింగ్ తండ్రిని నకత్‌ సింగ్‌ వాహరంతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో 22 ఏళ్ల తర్వాత అతడు తన తండ్రి మరణానికి అదే తరహాలో ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.