Friday, September 20, 2024
Homeక్రైంకోర్టులో అల్లుడిని కాల్చిన చంపిన మామ‌

కోర్టులో అల్లుడిని కాల్చిన చంపిన మామ‌

Date:

చండీగఢ్ జిల్లా కోర్టు ఆవరణలో నీటి పారుదలశాఖ అధికారి హర్‌ప్రీత్‌ని ఆయన మామ కాల్చి చంపారు. నిందితుడిని పంజాబ్‌ పోలీస్‌ రిటైర్డ్‌ ఏఐజీ మల్విందర్‌ సింగ్‌ సిద్ధూగా గుర్తించారు. వివాదం కేసులో రెండు పార్టీలు కోర్టుకు వచ్చిన సందర్భంలో కాల్పులు జరిగాయి. నిందితుడి న్యాయవాదులు, అక్కడే ఉన్న పలువురు వెంటనే నిందితుడిని పట్టుకొని ఓ గదిలో బంధించారు. హర్‌ప్రీత్‌ని వెంటనే ఆసుపత్రికి కారులో పీజీఐకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. హర్‌ప్రీత్‌ అతని భార్య డాక్టర్‌ అమితోజ్‌ కౌర్‌ మధ్య వివాదం నడుస్తున్నది.

ఈ 2023 నుంచి ఇద్దరి మధ్య విడాకుల కేసు కొనసాగుతుండగా.. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. తాజాగా నాలుగోసారి ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. హర్‌ప్రీత్‌ సింగ్‌పై కాల్పులు జరిపిన సమయంలో అతని తల్లిదండ్రులు సైతం అక్కడే ఉన్నారని పోలీసులు తెలిపారు. నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిగాయని.. ఇందులో రెండు తూటాలు హర్‌ప్రీత్‌ సింగ్‌ కడుపు, తొడ భాగంలో తగిలినట్లు తెలిపారు. నిందితుడి మల్లింగ్‌ సింగర్‌పై సెక్టార్‌ 36 పోలీస్‌స్టేషన్లో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103(1) ఆయుధాల చట్టంలోని 25, 27, 54,59 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పులు చోటు చేసుకోవడం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. నిందితుడు భవనంలోకి వచ్చిన సమయంలో భద్రతా సిబ్బంది అతన్ని తనిఖీ చేయడంలో విఫలమయ్యారని, భద్రతా ప్రోటోకాల్‌లో లోపాలు వెలుగు చూశాయి. సంఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేయలేదనే తెలుస్తున్నది.